దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
February 11, 2022
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. తాజాగా కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది ,
అటు తాజాగా దేశవ్యాప్తంగా 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 6,97,802 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 48,18,867 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామని… ఇప్పటి వరకు మొత్తం 1,71,79,51,432 డోసుల కరోనా వ్యాక్సిన్లను వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.