అప్పన్న దేవస్ధానంలో కోటితో మరమ్మత్తు పనులు
---దాతల సహకారం కోసం ఈవో ప్రయత్నం
--ఘాట్రోడ్డులో అన్ని వీధిదీపాలు వెలగాల్సిందే
విశాఖపట్నం,ఫిబ్రవరి23 : సింహచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్ధానానికి చెందిన పలు ప్రాంతాల్లో సుమారు కోటి రూపాయాలతో మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ తెలిపారు. అయితే అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాతల సహకారం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. బుధవారం ఆలయంలో ఈవో ఎంవీ సూర్యకళ తో పాటు అప్పన్నదేవస్ధానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు హుండీలు లెక్కింపు పర్యవేక్షించారు. ఈ సందర్భముగా ..పలు అంశాలను ఈవో దృష్టికి శ్రీనుబాబు తీసుకువెళ్లారు.ప్రధానంగా సింహాగిరి ఘాట్రోడ్డులో 31 వీధి దీపాలు వెలగడం లేదని, ఈ విషయాన్ని తాను గుర్తించడం జరిగిందని ఈవోకి వివరించారు. దీంతో తక్షణమే స్పందించి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజును పిలిపించి వెంటనే వీధిదీపాలు వెలిగేలా చూడాలని ఈఓ ఆదేశించారు. ఘాట్రోడ్డులోనూ, కొండ దిగువున తొలిపావంచ వద్ద రహదారులు గోతుల మయంగా మారాయని ఈవోకి తెలిపారు. వాటికి కూడా వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయిస్తున్నట్లు ఈఓ చెప్పారు. అందరి సహకారంతో దేవస్ధానాన్ని పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసి భక్తులకు మరింతగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు.