రైతులందరికీ నిధులు విడుదల చేసి మాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధనకార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు
హైదరాబాద్,జూన్19,టుడే న్యూస్: ప్రభుత్వ హామీ మేరకు బ్యాంకుల్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ నిధులు విడుదల చేసి మాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధనకార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని టిఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 36.68 లక్షల మంది రైతులకు 19,198.38 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని గుర్తు చేశారు. మూడున్నర సంవత్సరాలలో రుణ మాఫీ కోసం 1148.38 కోట్లు విడుదల చేసి ఐదు లక్షల 66 వేల మంది రైతు రుణాలు మాఫీ చేసి మిగతా వారిని విస్మరించారని ఆరోపించారు. 31 లక్షల మంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు .ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వస్తుందన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే బ్యాంకులకు రుణమాఫీకి నిధులు విడుదల చేసి బ్యాంకు లో ఉన్న పాస్ పుస్తకాలు రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యాన్ని రైతుల నుండి ప్రభుత్యం కొనుగోలు చేసి నెలలు దాటుతున్నా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయలేదని ఆరోపించారు. నిబంధనల ప్రకారం కాంట పెట్టిన వారం రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇంకా వేల మందికి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సిందని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తక్షణమే రైతుల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు పెట్టుబడి సహాయం రాక.. ధాన్యం అమ్మిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వక పోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.