కెజిహెచ్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: - జిల్లా కలెక్టర్ డా. ఎ . మల్లికార్జున .




కెజిహెచ్ ఓ పి కౌంటర్ వికేంద్రీకరణకు ఆదేశాలు.

మొత్తం ఏడు ప్రభుత్వ ఆసుపత్రులలో 73 పనులకు గాను రూ. 4,15,66,657 /- లకు అనుమతి మంజూరు.

విశాఖపట్నం,2023 జనవరి 10, టుడే న్యూస్: కెజిహెచ్ ఆసుపత్రి కి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ . మల్లికార్జున వైద్యాధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం  ఉదయం కెజిహెచ్  సమావేశ మందిరంలో  జ‌రిగిన‌ కెజిహెచ్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రి ల యొక్క అభివృద్ధి క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న ప‌లు మార్గ‌ద‌ర్శకాలు జారీ చేశారు. స‌మావేశంలో భాగంగా ముందుగా కేజీహెచ్ కి సంబంధించి సూప‌రింటెండెంట్ అజెండా అంశాల‌ను ప్ర‌స్తావించారు. గ‌త స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను క‌మిటీకి వివ‌రించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కెజిహెచ్ లో  రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని  అభివృద్ధి చేయాలని  అన్నారు. ఆసుప‌త్రి అభివృద్ధికి, మౌలిక వ‌స‌తుల క‌ల్పన‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు. ఎం.ఆర్‌.ఐ. స్కానింగ్ మెషిన్ రావటానికి మరికొంత సమయం ఆలస్యం కారణంగా ప్రజలకు అసౌక్యరం కలుగకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా సేవలను అందించాలని తెలిపారు. పీడియాట్రిక్ వార్డ్ నందు పీజి విద్యార్థులకు టాయిలెట్స్ కొరకు రూ.4లక్షలకు, కెజిహెచ్ లో గల సుబ్బిరామిరెడ్డి సత్రం మరమ్మత్తులకు అనుమతి మంజూరు చేసారు. ఆసుపత్రి పవర్, వాటర్ బిల్ కోసం అధికంగా ఖర్చు అవుతోందని సూపరింటెండెంట్ కలెక్టర్ కు తెలుపగా సోలార్ పవర్ కోసం గత సమావేశంలోనే అనుమతి మంజూరు చేశామని, ఇంకా ఎందుకు పనులు చేపట్టలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుండి రూ. 50 లక్షలు, సిఎస్సార్ ద్వారా రూ.20 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న రోగులని హెచ్ ఒ డి లు అందరు ఆరోగ్య శ్రీ ద్వారా నమోదు చేసి చికిత్సలు చేసినట్లయితే ఆసుపత్రి కి , అదేవిదంగా వైద్యులకు కూడా నిధులు అందుతాయని పేర్కొన్నారు. కెజిహెచ్ కు హెచ్.పి.సి.ఎల్ ద్వారా త్వరలోనే 10 కొత్త అంబులెన్సు లు అందుతాయని కలెక్టర్ తెలిపారు. కార్డియో థోరోసి విభాగాన్ని సిఎస్సార్ బ్లాక్ లోకి తరలించేందుకు అనుమతి ఇచ్చారు. కార్డియాలజీ విభాగంలో 2డి ఎకో యంత్రాలు రివాల్వింగ్ ఫండ్ ద్వారా కొనుగోలుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. యూరాలజీ విభాగంలో యంత్రాల కొనుగోలుకు రూ.25 లక్షలు మంజూరు చేసారు. ఓ పి కౌంటర్లను వికేంద్రీకరణ చేసి రోగులకు సౌకర్యవంతంగా ఉండేటట్లు మార్చాలన్నారు. క్యాజువాలిటీ వద్ద ఫౌంటెన్, గార్డెనింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. చనిపోయిన వారికి సుదూర ప్రాంతాలకు వెళ్ళుటకు మహా ప్రస్థానం వాహనం లేనపుడు ప్రైవేట్ వాహనాలు గతంలో నిర్ణయించిన ధరలకే తీసుకు వెళ్లాలని లేని యెడల కేసులు నమోదు చేయాలన్నారు. హెచ్ ఒ డి లకు కేటాయించిన లక్ష రూపాయలు ప్రజల సౌకర్యార్థం ఖర్చు చేయాలన్నారు. సూపరింటెండెంట్ పేర్కొన్న పలు రకాల పనులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వెంటనే ప్రతిపాదనలు పంపి పనులు వేగంగా పూర్తి చేయాలనీ సూపరింటెండెంట్ ని ఆదేశించారు. కెజిహెచ్ లో మొత్తం 28 పనులకు గాను రూ. 2.98 కోట్లకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు.    

    ప్రాంతీయ కంటి  ఆసుపత్రి సూప‌రింటెండెంట్ విశ్వా మిత్ర ఆసుపత్రిలో ప్రతిరోజూ 300 మంది కి ఓపీ సేవలు, 30 సర్జరీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కు తెలిపారు. గత సమావేశంలో కలెక్టర్ మంజూరు చేసిన జెనరేటర్ , ట్రాన్సఫార్మర్ పనులు పూర్తి అయినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మొత్తం రెండు పనులకు గాను రూ.27 లక్షలకు అనుమతి మంజూరు చేసారు.

    ప్రభుత్వ  విక్టోరియా ఆసుపత్రి సూప‌రింటెండెంట్ ప్రసాద్ ఉష పేర్కొన్న అత్యవసర పనులకు అనుమతి మంజూరు చేసారు. విక్టోరియా ఆసుపత్రి లో రెండు పనులకు గాను రూ. 4.5 లక్షలకు అనుమతి ఇచ్చారు.

ఛాతీ , ఇ ఎన్ టి , మానసిక , ఆర్ సి డి  ఆసుపత్రుల హెచ్ డి ఎస్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ : 

 తదుపరి పెదవాల్తేర్ నందు గల ప్రభుత్వ ఛాతీ , అంటువ్యాధుల ఆసుపత్రిలో ఛాతీ , ఇ ఎన్ టి , మానసిక , ఆర్ సి డి  ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఆసుపత్రులలో అభివృద్ధి పనులకు పలు ఆదేశాలు జారీ చేసారు. ఆసుపత్రి లో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశించారు. మంజూరు చేసిన పనులు త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

      ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో మొత్తం 14 పనులకు రూ.16 లక్షలు , ఇ ఎన్ టి ఆసుపత్రిలో 17 పనులకు గాను రూ.19.52 లక్షలు , రాణి చంద్రమణి దేవి ఆసుపత్రిలో 4 పనులకు రూ.16.09 లక్షలు , ప్రభుత్వ మానసిక వైద్యశాల లో 6 పనులకు రూ.34.54 లక్షలకు  అనుమతులు మంజూరు చేసారు. 

        ఈరోజు జరిగిన హెచ్డిఎస్  సమావేశంలో  7 ఆసుపత్రులలో మొత్తం 73 పనులకు రూ.4,15,66,657/- లకు కలెక్టర్ అనుమతి మంజూరు చేసారు.

      ఈ స‌మావేశంలో డీఎం & హెచ్‌వో జగదీశ్వరరావు , ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ బి.ఎ. నాయుడు, క‌మిటీ స‌భ్యులు కుమార్ రాజా, ఆనంద్ సింఘ్‌, వైద్యాధికారులు, వైద్యులు, ఇత‌ర ఉద్యోగులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు